Saturday 30 November 2013

సంస్కృత సంస్కృతి


సంస్కృతం=సమ్యక్ +కృతం అనగా సంపూర్ణముగా సంస్కరింప బడినది అని అర్థము. 

సృష్ట్యాదినుండి అది ధ్వనిరూపములో ఆకాశాన్ని అంటిపెట్టుకొనే వుంది. ధ్వని శబ్ద సంకలనమే. 

సూత్రాను సారిణి యైన శబ్ద సంకలనమే భాష. వ్యాకరణము ఛందస్సు భాషామతల్లి స్త్న్యములు 

అంటారు. బుడ్డిపాల కలవాటుపడి తల్లి పాలు త్రాగే అవకాశము పోగొట్టుకొన్న వానికి తల్లి పాలరుచి 

తెలిసే అవకాశమెదీ!అపౌరుషేయమైన వేదము యేభాషలో ఉన్నదో ఆ భాష కూడా అపౌరుషేయమే

కదా.ఆవేద భాషే ఆది భాష, ఆ ఆది భాషే సంస్కృతము. రామాయణము ఆది కావ్యము.

వేదభాష గా బ్రహ్మ నుండి దేవతలు ఋషులు వారి నుండి భూలోక వాసులకు ఈ భాష

సంక్రమించినది. వేదానికి షడంగములైన శిక్ష, వ్యాకరణ,ఛందస్,నిరుక్త,జ్యోతిష కల్పములలో వ్యాకరణము

కలదు ఆ వ్యాకరనమును విడమరచి విశధీకరించిన మొదటి మహానుభావుడు పాణిని.

పాణిని మహర్షి తన 'అష్టాధ్యాయి'అను వ్యాకరణ ప్రామాణిక సూత్రగ్రంథమందు ఈ క్రింది శ్లోకాన్ని

తెలియబరచినారు :

'నృత్తావసానే నటరాజరాజో నానంద ఢక్కాం నవపంచ చారం

ఉద్ధర్తు కామః సనకాది సిధ్ధా నేతద్విమర్శే శివసూత్రజాలమ్'

కైలాసము లో తాండవ మూర్తి యైన పరమ శివుని నృత్తావసాన సమయమున ఆయన చర్మ

వాద్యమైన తన ధమరుకమును వాయించుచూ నృత్యాన్ని ముగించుతారు . దాన్ని

'చోపు' అంటారు . ఆ తాండవ నృత్యానికి తన్మయులైనా ప్రేక్షకులలో సనక,సనందన,సనాతన

సనత్కుమారులు మరియు పతంజలి వ్యాఘ్రపాద పాణినీ ప్రభ్రుతులు ఉండినారు. ఆ చొపు లోని

నవ పంచ చారం అంటే 9+5=14 దరువులను ఏక సంతాగ్రాహియైన పాణిని గ్రహించి తన

'అష్టాధ్యాయి' అన్న సూత్ర గ్రంథము లో పొందు పరచిరి . వీనిని మాహేశ్వర సూత్రములందురు.

శివుని ఢమరుకము నుండి ప్రభవించిన ఆ దరువులీ విధంగా వున్నాయి.

1. ఆఇఉణ్ 2. ఋల్క్ 3. ఎఒఙ 4. ఐఔచ్ 5. హయవరట్ 6. రణ్ 7. ఞమఙణనమ్ 8. ఝభణ్ 9.

ఘడధష్ 10. జబగడదశ్ 11. ఖఫఛద్ధయచటతవ్ 12.కపయ 13. శషసర్ 14. హల్

ఇందులో స్వరములు 16.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఌ ౡ ఎ ఐ ఒ ఔ అం అః

వ్యంజనములు :

క్ ఖ్ గ్ ఘ్ ఙ్ చ్ ఛ్ జ్ ఝ్ ఞ్ ట్ ఠ్ డ్ ఢ్ ణ్ త్ థ్ ద్ ధ్ న్ ప్ ఫ్ బ్ భ్ మ్ శ ష్ స్ హ్ క్ష్ త్ర్ ఙ్ఞ్

ఇందు వ్యంజనముల వర్గీకరణము ఒక గొప్ప విషయమైతే వీటి జన్య స్థానములను నిర్దేచి

కంఠ్యములుగా,తాలవ్యములుగా, మూర్ధన్యములుగా,అనునాసికములుగా,వర్గీకరించడం మరొక

గొప్ప విషయము. ఈ వివరణ పురాతన భాషలని గొప్పలు చెప్పుకొనుచున్న గ్రీకు లాటిన్ ఫార్సీ

అరబ్బు వంటి ఎ భాషకును లేదు. పాణిని వారిది మొదటి వ్యాకరణ శాస్త్రమని భాషజ్ఞ్యులు
(philologists) నిర్ద్వందంగా అంగీకరించిన విషయము. అసలు వీనికి 'అక్షరములు' అన్న పేరు పెట్టడంలోనే అసలు రహస్యం దాగివుంది. న+క్షరము=అక్షరము .అంటే నశించనిది యని అర్థము.
పరమేశ్వరుడు అక్షరుడు. వేదములు అక్షరములు. ఈ సంస్కృత భాష అక్షరము. ఇటువంటి పడజాలముల ఉత్పత్తియే ఈ భాష ఘనతను చాటుతూ వుంది.


సంస్కృత సంస్కృతి (నిన్నటి రచనకు కొనసాగింపు )

నేటికి కూడా సంస్కృతము భారతదేశపు 23 అధికారిక భాషలలో ఒకటి. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135 (2011 గణాంకములు నాకు దొరకలేదు. ) అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటక లోని 'మత్తూరు' అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. సంస్కృతం అంటే 'సంస్కరించబడిన','ఎటువంటిలోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థమని ముందే చెప్పుకొన్నాము.ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం.

సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులని వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపి గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి , తమిళ లిపి , బెంగాలీ లిపి,మొదలగునవి లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; మరియు భారతజాతీయతకుజీవగర్రయై,
భారతీయభాషలకుఉచ్ఛ్వాసప్రాయమై,సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడ ప్రధానభూమికను నిర్వహింపగల్గుట పరమ విశేషము.ఇది మహామహోపాధ్యాయ శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు (Lecturer in Sanskrit, S.R.R. & C.V.R College, Vijayawada)చెప్పిన మాట. సంస్కృతము యొక్క గోప్పతనమేమిటన్నది చాటుటకు వారు వ్రాసిన ఈ ఒక్క శ్లోకము చాలు: "సుధా స్రవంతీ సుర భాషి తాయా -సుచ్చాన సూక్తి సురత్న వార్ధిః -సుకావ్య సందోహ నిధిశ్చ వాణీ -సా సంస్కృతాఖ్యా ,సుకృతిః కలాభ్యా" "నా మాతృభాషా భువి సంస్కృతాఖ్యా" సంస్కృతమే సర్వ భాషలకు ,సర్వ కళలకు మూలము సమస్త సంస్కృతికి మూలము అని స్థూలముగా ఈ శ్లోకములకర్థము .

సుమారు 150 సంవత్సరములక్రిందట భాషాసాదృశ్య శాస్తము (Comparative Philology) విజ్ఞాన
ప్రపంచములో నుద్భవించెను. గ్రీకు, లాటిను, ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచి మున్నగు యూరోపియన్ భాషలనడుమ, అత్యంత సన్నిహితసంబంధము కలదనియు, ఈభాషలన్నియు ఆదిలో నేకమాతృసంజనితలనియు,మాతృ స్థానము సంస్కృతముదనియు గ్రహించిరి. ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. అట్టి విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను.“గ్రీకు, లాటిను, గొతిక్ మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతమునుండియే, ఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో 16 వ సంపుటము ప్రధమ భాగములో 177 వ పుట. )

నిష్పక్షపాతబుద్ధితో ఈరీతిగా సంస్కృతభాషకు యూరపీయభాషామాతృత్వము నంగీకరించినవారు కొందరు
కలరు. 1834 వ సంవత్సరములో R.A.S. పత్రికలోనే ద్వితీయసంపుటములో Sanskrit Literature అను శీర్షిక క్రింద W.C. టెయిలర్ వ్రాసిన యీక్రిందిమాటలుకూడ గమనింపదగియున్నవి. “ప్రాచీనయూరోపీయభాషల కన్నింటికిని తల్లి హిందూదేశపుభాషయే. దేశములో ఎన్నిమార్పులు వచ్చినను ఆ భాషను హిందూదేశము నిలబెట్టుకొనగల్గినదని మనము ఆశ్చర్యముతో కనుగొంటిమి.” జ్యేష్ఠభగినీవాదియైన మాక్సుముల్లరుకూడ సంస్కృతమంత ప్రాచీనభాష మరియొకటి లేదనియు, ఇకమీదటకూడ అట్టిది కన్పట్టుట కవకాశము గోచరింపదనియు చెప్పియున్నాడు. ఆధునిక శాస్త్రములు కన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, ప్రపంచభాషలకన్నింటికిని సంస్కృతమట్టిదని యాయన నుడివినాడు. “What Mathematics is to the Sciences, the same is Sanskrit to the languages of the world”.సంస్కృతమునేర్చిన పాశ్చాత్య పండితులేకాక, ఇతర పాశ్చాత్య విద్వాంసులుకూడ నీ యభిప్రాయమునంగీకరించినారు. జాన్ రస్కిన్ కూడ ఇంగ్లీషుభాషలో పాండిత్యము గలుగవలెనన్నచో మాక్సుముల్లరు రచించిన Biography of words అను గ్రంథమును చదువవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో ప్రధానముగా యూరపీయ భాషాపదముల సంస్కృతభాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడినది. దానిని చదువుటవలన ఇంగ్లీషుపదముల శక్తి, వినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభీప్రాయము.(చూ: Sesame and Lilies.)
సంస్కతభాష సమస్త భాషలకు మాతయైనట్లే, సంస్కృతభాషాఘటితమైన విజ్ఞానముకూడ సమస్తదేశ ప్రాచీన విజ్ఞానమునకు మూలమైయున్నది. విజ్ఞాన ప్రవాహము భారతదేశమునుండి బయలుదేరి యేరీతిగా పర్షియా, అరేబియా, గ్రీసు మున్నగు దేశములకు వ్యాపించినదో విపులముగా వివరించుచు పోకాక్ అను ఆంగ్లేయుడు India in Greece అను గ్రంథములో నిరూపణచేసియున్నాడు. బాబిలోనియా, ఈజిప్టు మున్నగు దేశములలో అతిప్రాచీన నాగరికత యని భావింపబడుచున్నది భారతదేశసంస్కృతియొక్క విస్తారమే యని ఆ గ్రంథములో వివరముగా తెలుపబడినది. ప్రపంచములోని యేభాషలోను వాజ్ఞయము పుట్టక పూర్వమే, సంస్కృతములో వాజ్ఞయము బయలుదేరినదని ఎల్లరు నంగీకరించుచున్నారు. మానవ పుస్తకభాండాగారములో ఋగ్వేదమే మొదటిగ్రంథమని మాక్సుముల్లరు నుడివియున్నాడు.“Rig Veda is the first book in the Library of man.” ప్రపంచములో మొదటికావ్యమగు రామాయణము సంస్కృతభాషలో నుద్భవించినది, ప్రపంచములోని మొదటి జ్యౌతిషగ్రంథము, మొదటి నాట్యశాస్త్ర గ్రంథము, మొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతభాషలోనే యుద్భవించినవి. కావున ప్రపంచవిజ్ఞానచరిత్రలో సంస్కృతభాషకు విశిష్టమైనస్థానము కలదు. విశ్వవిఖ్యాతిగల షోపెన్ హోవర్ అను జర్మనువిద్వాంసుడు "ఉపనిషత్పఠన మంత లాభదాయకమైనది, ఔన్నత్యాపాదకమైనది మరొకటిలేదు. అది జీవితకాలమంతయు నాకు ఆశ్వాసజనకముగా నున్నది. మరణ సమయమునకూడ అదియే నాకు ఆశ్వాసహేతువు కాగలదు” అని నుడివినాడు.ఫ్రెడెరిక్ ష్లెగెల్ "భారతీయుల భాష, విజ్ఞానము” అను గ్రంథములో నిట్లు వ్రాసెను. “ప్రాగ్దేశస్థుల ఆదర్శ ప్రాయమైన విజ్ఞానజ్యోతి ముందర గ్రీకువేదాంతుల తత్వశాస్త్రము అప్రతిబద్ధమై మినుకుమినుకుమను నిప్పునెరసువలె నుండును”.సంస్కృతభాషయొక్క కట్టుబాటును గురించి మోనియర్ విలియమ్స్ యిట్లు పల్కినాడు. “ఇంతవరకు ప్రపంచములో బయలుదేరిన అద్భుతగ్రంథములలో పాణిని వ్యాకరణ మొకటి. స్వతంత్ర ప్రతిభ లోను, సూక్ష్మ పరిశీలనలోను పాణినీయ వ్యాకరణముతో పోల్చదగిన గ్రంథమును మరియే దేశమును సృజించుకొనలేదు”.


సంస్కృత సంస్కృతి (3వ భాగము )

*******************************************************************
*దయయుంచి ఈ వ్యాసము చదువుటకు మీ అమూల్యమైన సమయమునుండి కొంత కేటాయించండి. * *మన సంస్కృతము యొక్క గొప్పదనము కొంతైనా తెలుసుకొనుట ఎంతో అవసరము . మీకు******* *ఉపయొగకరముగా ఉందనిపిస్తే ఆ భాషకు నమస్కరిస్తూ 4 మంచి మాటలు వ్రాయండి . *********
*******************************************************************

వేదవ్యాస వాల్మీకి మునీనాం
కాళిదాస బాణాది కవీనాం
మునివర వికసిత కవివర విలసిత
మంజుళ మంజూషా సుందర సుర భాషా

శృతి సుఖ నినదే సకల ప్రమోదే
స్మృతిహిత వరదే సరస వినోదే
గతిమతి ప్రేరక కావ్య విశారదె
తవ సంస్కృతిరేషా సుందర సుర భాషా

ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ స్వామీ
వివేకానంద నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ ఎక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయు, ధర్మ్యతయు కలియుట మేలనియు, కాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించినారు. షేక్స్పియరు లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము వాల్మీకి రామాయణము మాత్రమే. ఈ యంశమును స్వామి వివేకానందుడు అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను.“Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”.కాళిదాసాది ఇతర సంస్కృత దిగ్గజ కవుల గ్రంథములను పఠించు సమయములో అన్ని రసములూ మనము జూచిననూ అన్నిటికన్నా మిన్నగా ధర్మ ప్రతిపాదన మనకు అనుభవగోచరము.అట్టి గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసి, వారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి.

ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయినది. మన సంస్కృతిని మరచి ఆధునికవిజ్ఞానమును మాత్రమే మనముపయోగించుకొందుమేని అది ప్రపంచమునకు శాంతి ప్రదానము చేయలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. సంస్కృతికి సైన్సుకు సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిన సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచు, స్పష్టపరిచి యున్నారు.భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క
ప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు
యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా
సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని
శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).కాంట్, స్పైనోజా , ఎమర్ సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, సోమర్సెట్ మామ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావము ప్రస్ఫుటముగా గోచరించును. యూరపులో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు.(1 వ పుట)
సంస్కృతభాషను నేర్చి, భారతీయుల జీవితపద్ధతులను చూచిన పాశ్చాత్యపండితు లెల్లరు సంస్కృత
భాషానిబద్ధసంస్కృతికిని, భారతీయుల జీవితమునకును గల సన్నిహిత సంబంధమును, సమన్వయమును చూచి యాశ్చర్యపడిరి. భారతీయజీవితము నర్ధముచేసికొనుటకు సంస్కృతభాషా వాఙ్మయపరిచయము అవసరమని గుర్తించిరి. కావుననే బ్రిటిష్ ప్రభుత్వకాలములో ఈ దేశమునకు పరిపాలకులుగా రాదలచిన ఐ. సి. యస్. పరీక్షాభ్యర్ధులకు మాక్సుముల్లరు రచించిన India; What can it teach us? అను గ్రంథము పఠనీయముగానుండెను.ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయశాస్త్రములోజాతీయతకు(Nationhood) కావలసినవిగ చెప్పబడినయంశములలోభాషైక్యమొకటి.ప్రాచీనభరతఖండములోప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును బీహారు ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు ఆంద్రుడు బీహారీని "మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. 'భోజనము', 'శ్రమ', 'దానము' మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. కావున భాషా భేదమున్నను, భారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు.


సంస్కృత సంస్కృతి (4వ భాగము)

'సంస్కృత సంస్కృతి' చివరిభాగామిది. దయవుంచి పాఠకులు శ్రద్ధగా చదివి మీ అభిప్రాయములు తెలిపేది. 
ఇది నేను శ్రమపడి వ్రాసి టైపు చేసినాను. ఏదో లైకు కొట్టి 'ఇచ్చుకొంటి వాయనం ' అన్న శాస్త్రము చేయవద్దు. 
నన్ను తప్పుగా తలవరను నమ్మిక తో ఈ మాట వ్రాసినాను. 

వరవీణా మృదుపాణీ 
వనరుహ సంభవ రమణీ 
అలికుల శ్యామల వేణీ 
స్తవనమిదం తవవాణి 

శృతి సుఖ వరదే శివదే
కవికుంజర బుధ్ధినిధే
ఋషిమునివర మాన్యపదే
సంస్కృత సంస్కృతి వరదే ॥ వర॥

సంస్కృతభాషవలెనే తద్భాషా నిబద్ధమైయున్న విజ్ఞానముకూడ భారతదేశమున కు ఏకత్వము సాధించినది. రామాయణము, మహాభారతము, భర్తృహరి సుభాషితములు మున్నగునవి భారతదేశములోని ఏప్రాంతమువారికైను సమాన పరిచితములే; వానినిచూచి యుప్పొంగని భారతీయుడు లేడు. సంస్కృతభాషను కాళిదాసాది విరచిత శ్లోకములద్వారా నేర్పు సంప్రదాయమొకటి మన దేశములో నున్నది. దీనివలన సంస్కృతము, సంస్కృతి కూడ ఒకేసారి బాలబాలికల హృదయములో ప్రవేశించుటయే కాక వారి మేధస్సు లో ఆజన్మాంతమూ అవి స్థిరముగా నిల్చును. నిత్య నైమిత్తిక దైనందిన చర్యలలో వాని అవసరము కలుగుచునే యుండును.
సంస్కృతము ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. మృతభాషలైన గ్రీకు, లాటినులను సంస్కృతముతో పోల్చి చూతుమేని ఆ నిజాము అర్థము కాగలదు.సంస్కృతము నేర్వనివారికి కూడ లోకోక్తి రూపముగాను, సుభాషితరూపముగాను పదులకొలదిగనైనను సంస్కృతశ్లోకములు వచ్చియుండును. పైని చెప్పిన లక్షణములలో ఏదియు మృతభాష కుండదు.సంస్కృతము మృతభాష కాకుండుటయేకాక మాధుర్యభరితమై యున్నందున అమృతభాషయని చెప్పదగియున్నది.హిందూమతముతో బాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృతవిరహితమైన హిందూమతము ఊహకుకూడ అందనిది. హిందువుల మతగ్రంథములన్నియు - వేదములు, పురాణేతిహాసములు, భాష్యములు మున్నగునవన్నియు - సంస్కృతములోనే యుండుటచేతను, నిత్యకర్మలును. పూర్వాపర కర్మలును యజ్ఞ హోమములును, పారాయణగ్రంథములును, అన్నియు సంస్కృతములోనే యున్నందున హిందువులకిది శాశ్వతముగ సమాశ్రయణీయము. మహాత్మా గాంధి యిప్పట్ల నుడివిన యీ మాటలు గమనింపదగినవి.ఒకప్పడు క్రైస్తవమతమునకు పవిత్రభాషగా నుండి క్రైస్తవమతముతోబాటు శాశ్వతముగా జీవించీతీరునను అభిప్రాయమును గల్గించుచుండిన లాటిను భాష ఈనాడు క్రైస్తవమతమును వీడినట్లు సంస్కృతము హిందూమతమును వీడుటకు వీలు లేదు. అసలిపుడు లాటిను భాషయే అంతర్ధానమైనది. కారణ మేమంటే (1)ఆదిలో లాటిను ద్వారా క్రైస్తవమతము యూరపులో వ్యాపించినను, తన్మత మూలగ్రంథము లాటిను పుట్టియుండలేదు. (2) హిందూమత మూలగ్రంథములలో అర్ధశక్తియేగాక అక్షరశక్తికూడ కలదు ఆ అక్షరములు అదేరీతిగా, అదేస్వరముతో ఉచ్చరింపబడుచో దాని ఫలితము మిక్కుటమని అనభవ పూర్వకముగా నెరిగిన వారెందరో యున్నారు. కావున మన సంస్కృతిలో మూల గ్రంథమునకు ప్రముఖస్ధానము ఎప్పుడును పోదు. (3) సంస్కృత పదములు ధాతు జన్యములు. మనము ఎన్ని కొత్త పదాలనైనా ఇందులో సృష్టించుకొన వచ్చును.త్రిమతా చార్యుల శాస్త్ర భాష్యము లన్నియు ఈ ధాతు విశ్లేషణముతో అర్థ వివరణ గావించి యున్నారు. ఆ విధముగా ఇంకా ఎందరో మహానుభావులు భాష్యములను వార్తీకములను రచించి యున్నారు. కావున ఈ మతముతో సంస్కృత భాషకుగల సంబంధ మెన్నటికిని పోదు. (4) ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ
భారత భాగవతములకు అసంఖ్యాక అనువాద గ్రంథములు బహు భాషలలో బయలుదేరినను ఏ యొక
ధార్మికవిషయమునగాని భక్తివిషయమునకాని తత్వవిషయమున కాని సందేహము వచ్చినను మూల
సంస్కృతగ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారుకానియీప్రాంతీయభాషాగ్రంథములను
చూచి సందేహమునెవ్వరును తీర్చుకొనుటలేదు. కావున ప్రామాణికత గల మూలసంస్కృత గ్రంథములు చెక్కు చెదరవు . (5) సంస్కృతమువంటి అమూల్యరత్న నిధానమును హిందువుల జీవన విదానముతో ముడిపడి యున్నందున అది అమరము. ఆధునిక యుగమున భారతదేశములో ఫ్రాంతీయ భాషలకుసంస్కృతమువలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. ఏభావమునైనను, భావచ్చాయనైనను తెలుపగల పదములు సంస్కృతములో సిద్ధములై యుండుటయేకాక అవసరమున కనుకూలముగా నూతన పదములను సృజించుకొను అవకాశము ఇందున్నంత పుష్కలముగా మరి యేభాషలోను లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపపర్గల వలనను తిఙకృత్ప్రత్యయముల వలనను అనంతపదజాలము కల్పింపబడుట కవకాశమున్నది. అట్లే సుబంత తద్ధిత రూపములును కొల్లలుగా సంపాదింపబడును. ఒక్కధాతువునుండి సుమారు 150 పదములను సృజించు అవకాశము సంస్కృతములో
కలదు. ఇట్టి యవకాశము మరి యే భాషలోను లేదు. ఇంత భాగ్యవంతమును, సమృద్ధి మంతమును అయిన భాష ఆధునికయుగములో నిర్వహింపవలసినకార్యమెంతయోకలదు.బహువిధోద్యమములతోను, వైజ్ఞానిక సంచలనములతోను చైతన్యవంతమైన ఆధునిక కాలములో సంస్కృతము చేయుచున్నట్టియు,
చేయగల్గినట్టియు సహాయ మింతింతయని చెప్పజాలము. 1920 వ సంవత్సరమునకు పూర్వము మనదేశములో "అతలాకుతలము ”, “మహిలసమస్య ”, “దృఢసంకల్పము” మున్నగు పదములకు అర్థమేమని దారినిపోవువాని నెవ్వని నైనను అడుగుచో అతడు తెల్లబోయెడివాడు. నేడు దిన పత్రికలను చదువు సామాన్యజనుడు కూడ వీనియర్ధమును గ్రహించగల్గుచున్నాడు. మనకు తెలియకుండగనే సంస్కృతము మనకు సహాయము చేయుచు తన విలక్షణప్రభావమును లోకమునకు చాటుచున్నది.
ఆధునిక నాగరికతకును సంస్కృతభాషకును ఇట్టి సంబంధము కలదు. ఇది భారతదేశములోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్రప్రభుత్వమునకు అధికారభాష కావలసిన హిందీ పదములను స్వీకరింపవలసినపుడు ముఖ్యముగా సంస్కృతమునుండియు, తరువాత ఇతర భారతీయభాషల నుండియు (...by drawing, whereever necessary or desirable, for the vocabulary, primarily on Sanskrit and secondarily on other languages) స్వీకరింపవలయుననని భారత రాజ్యాంగ ప్రణాళికలో ఉపనిబద్ధమైయున్నది. (Part XVII, Chapter IV, 351)నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు
తట్టవలయునన్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళనమములలో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్ని ప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యతకలదో స్పష్టముగ గోచరించును.
సంస్కృతమునకు ప్రాంతీయభాషలతోగల సంబంధమును గురించిన విచారణము ఇంతటితో నాపి సంస్కృత పదముల సహజశక్తిని గురించి యొకింత చెప్పవలసియున్నది. ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగు ఉదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను. దశరథః = పది దిక్కులకును రథము నడుప గలవాడు. జిగమిషా = పోవలయునను కోరిక. రామతే = రామునివలె ఆచరించుచున్నాడు. కేశాకేశి = జుట్టుజుట్టు పట్టుకొని యుద్ధముచేయునట్లు. ఇట్టి శబ్దపటుత్వము నేటి ప్రపంచభాషలలో దేనికిని లేదు.
ఇంతియేకాక, రెండు, మూడు అక్షరములు గల చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపజేయుట
సంస్కృతములోనే కాంచనగును. ధర్మ శబ్దమువలన దాని నాచరించువాడు మంచిస్ధితిలో ధరింపబడునని
బోధింపబడుచున్నది. రథ్యా శబ్దమువలన పూర్వము వీధులు రథము నడుచుటకు తగినంత వెడల్పుగా
నుండెనని తెలుపబడును. శరీర శబ్దమువలన నిది శిధిలమైపోవునను (శీర్యతే) తత్వబోధ చేయబడుచున్నది. స్మృతి శబ్దమువలన మనుస్మృత్యాది గ్రంథములు, వేదములను స్మరించుచు వ్రాయబడినవే కాని తత్కర్తల స్వకపోలకల్పితములు కావని తెలియుచున్నది. ఈరీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తరశక్తి కన్పట్టుచున్నది. ఇతర భాషలలో నిది మిక్కిలి తక్కువ.ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తికావలసినచో సాధారణముగా ఇతర భాషలలోనికి పోయి
వెదుకవలసియుండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసినచో కెల్టిక్, ట్యుటానిక్, హైజర్మన్,
లోజర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగువానిలో అది లభించును; అట్లే యితర భాషాపదములకును, ఈ మూలభాష లనుకొనబడుచున్నవాని పదములకు వ్యుత్పత్తి కావలసినచోకూడ మరొక భాషలో నన్వేషణము చేయవలసియుండును. గ్రీకులోని పదములకు కూడ అనేకములకు సంస్కృతములో వ్యుత్పత్తి లభించును. ఒక్క సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషల కేగనక్కరలేకుండ ఆభాషలోనే లభించును.సంస్కృతముయొక్క సర్వ ప్రాచీనతకును స్వతంత్రతకును ఇది ప్రబల నిదర్శనము.అర్ధముకానివారికి కూడ శ్రవణ సుఖమును గల్గించు భాష సంస్కృతము. సంస్కృత శ్లోకములను విని యానందింపని వాడుండడు. నేటి భాషలలో కాని, గ్రీకు,లాటినులలోగాని సంస్కృత వృత్తములంత మధురములైన వృత్తములు లేవు. Most musical metres – మధురతమ వృత్తములు - ఆని ఎ. ఎ. మాక్డొనెల్ సంస్కృత వృత్తములను వర్ణించి యున్నాడు. భగవద్గీతాది గ్రంథములలోని అనుష్టుప్ శ్లోకములు, మందాక్రాంత, వియోగిని, ద్రుతవిలంబితము, మాలిని మున్నగు వృత్తములు మధురాతి మధురములై సర్వ మనోరంజక శక్తిగలవై యొప్పుచున్నవి.సంస్కృత పండితులు సరస సాహిత్య సల్లాపములను గావింపునపుడు కాని, వేదాంతగోష్ఠిని నెరపునపుడు కాని,
పురాణ ప్రవచనము సలుపునపుడు కాని వినునట్టి నవీన విద్యానాగరికతా సంపన్ను లెల్లరును తద్భాషా
సౌందర్యము నకును, విషయ మహత్త్వ మాధుర్యములకును ముగ్ధులగుటను గాంచుచున్నాము. ఉదాహరణము చాగంటివారి ,సామవేదం వారి ప్రవచనములే. ఆధునిక సభ్యతలో నెంత ఉన్నతస్థతిలో నున్న వారును ఈ భాషాను వాఙ్మయమును నేర్చియుండినచో తమ జన్మ ధన్యమయ్యెడిదని భావించుట సర్వత్ర కాంచనగును. సంస్కృతమునకు గల అద్వితీయ మాధుర్య మహత్త్వముల కిది ప్రబల నిదర్శనము.వేయేల వైదీకులు వేదమన్త్ర పఠనము చేయుచున్నప్పుడు మనకు మంత్రములు రాకపోయినా చెవులు రిక్కించుకొని విందుము. ఇది ఆ భాష యొక్క గొప్పదనము కాదా!ఇట్టి సర్వతోముఖ సౌరభ సౌభాగ్య సంభరిత సంస్కృతభాష భారత భాగ్యరాశిలో అమూల్యరత్న మగుటయేకాక భారతీయులకు భారతీయతను నిలబెట్టగల్గిన సర్వప్రముఖ సాధనమై యలరారుచున్నది.

భూమి పై మానవ సంస్కృతి మొదలైన రోజునుండి మాట్లాడుచూ వచ్చిన భాష యిది. పలువిధము లైన కారణములవల్ల భారతీయులు ఖండ ఖండాంతరములు వ్యాపించి ఈ భాషను వ్యాపింపజేయగా అది రాను రానూ అపభ్రంశమై స్థానిక భాషలుగా పరివర్తన చెంది యుండవచ్చునని నాయూహ.
కొన్ని పదాలు మచ్చుకు :
తమిళం:వాసగం---వాచకమ్, జొదిడమ్---జ్యోతిషమ్, ఆముదం---అమృతమ్,
యందిరం-యంత్రమ్, సంస్కృతమంటే మంటపడే కరుణానిధి గారి బిరుదైన 'కలైజ్ఞర్'=కలాజ్ఞ్య (దేవనాగరి లిపిలో ళ లేదు) సంస్కృత పదమే. కానీ చాలామంది తమిళులు పై పదాలన్నీ తమిళ పదాలేయను భ్రమలో వుంటారు. 9 వ్యాకరణములు కల్గిన ఈ సంస్కృతం లోని మొదటిది తమిళ వ్యాకరణమని చంద్రశేఖర యతీంద్రులు చెప్పగా విన్నాను. నరనరాలలో సంస్కృతమే కలిగిన తెలుగు భాషకు తల్లి సంస్కృతము కాకుండా ఎట్లు పోతుంది.
సంస్కృత శబ్దాలు గ్రీకు లాటిన్ జర్మన్ మొదలుగాగల ఎన్నో భాషలలోనికి పుంఖానుపుంఖాలుగా పోయి అక్కడినుండి ఆంగ్లము లోనికి చేరుకొన్నాయి.
ఉదా: నవ = new, పథ =path, తత్=that త్వ= thou, వచస్=voice ఇట్లు మదర్ ఫాదర్ మొదలైన పదాలన్నీ సంస్కృత జన్యములే.
ఇంచుమించు క్రి.శ. 800 లో పురుడు పోసుకొన్న నేడు అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లమునకు యిప్పటికీ ఒక నిలకడ గలిగిన వ్యాకరణము లేదు. 30% లాటిన్ నుండి మిగిలినవి గ్రీకు, ఫ్రెంచి, జర్మన్, మొదలుగాగల భాషలనుండి తీసుకోన్నవే. తిరిగి వానిలోని చాలా పదములకు మూలము సంస్కృతమే. 17 వ శతాబ్దములో వారి మొదటి నిఘంటువు ప్రచ్రించినపుడుండున్న పద జాలము 3000. ఆ పుస్తకము పైన ప్రచురించిన పేరు ఏమన 'A Table Alphabetical Containing And Teaching The True Writing And Understanding Of Hard Unusual Words of English Borrowed From Hebrew, Greek Or French.' ఇక్కడ ఒక్క విషయము మనవి చేసుకొంటాను. ఇది మనసు పెట్టి యోచించితే ఎంతో చింత పడుట కాదు సిగ్గు పడవలసిన విషయము. శర్మణ్య (germany ) దేశస్థుల వైమానిక సంస్థ పేరు Lufthansa = లుఫ్త్+హంస. లుఫ్త్ అంటే జర్మన్ భాష లో గాలి (వాయువు )అని అర్థము హంస అంటే మనకు తెలిసినదే. అంటే lufthansa = వాయు హంస అని అర్థము. మనము మన సంస్థ కు ఒక భికారి రాజు బొమ్మ తగిలించుకొని 'AIR INDIA' అనే పేరు పెట్టుకొన్నాము. ఫ్రెంచ్,జర్మన్,స్పెయిన్,గ్రీసు జపాను,కొరియా, చైనా,మొదలగు ఎన్నో దేశములు తమ మాతృభాషలోనే శాస్త్రాభివృధ్ధిని ఇతోధికముగా గావించుకొన్నాయి. దాదాపు 254 దేశములు కలిగిన ఈ ప్రపంచములో ఇంచుమించు 15 దేశాలు మాత్రమే ఆంగ్లము అనర్గళ ముగా మాట్లాడుతాయని విన్నాను. అదే నిజమైతే ఈ దేశము ఆంగ్లము అత్యధిక జనులు మాట్లాడే దేశమౌతుంది.
మధ్య తరగతి కుటుంబాలలో పుట్టి కోరిన చదువు చదువుకోలేక సంపాదనే సర్వస్వమని యెంచిన మాకాలము గతించినది.రాబోయే కాలము ఏంతో విజ్ఞానవంతులైన యువతరానిది. ఈయువత మాకు రానిది లేదు అని ముందుకు అడుగు వెయ గలిగితే మన దేశానికి పురాప్రాభవము ఎటుతిరిగీ సమకూర్చగలరు.
ప్రపంచ భాషలకాది భాషయైన ఈ సుర భాషను మరచి పర భాషను పట్టుకొని ప్రాకులాడుచున్న మన యువత మేలుకొంటుందని ఆశిస్తున్నాను.


#సంస్కృతభాష__ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది

సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.

1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే

2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.

3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.

4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.

5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.

6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.

7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.

8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.

9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.

10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.

11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.

12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.

13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.

14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే.

15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు.

16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో (  కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో  సంస్కృతబోధన జరుగుతోంది.


ఇప్పుడు చెప్పండి. #సంస్కృతం ఆవశ్యకమా? కాదా?


తత్సత్

Thursday 21 November 2013

కపర్దీ కాపాడు

శివునికి కాలకాలుడు అన్నపేరు కలదు. ఆయన యమునికి యముడు. ఆయనను ఒకసారి తలచుకొందామని తలంపు.
ఇది సీస పద్యము.
ఇంద్ర గణములారు ఇన గణమ్ములు రెండు
పాద పాదమునకు బరగు చుండు
ఆటవెలదియైన తేటగీతియునైన
చెప్పవలయు తుదిని సీసమునకు

ఇందు యతి నియమముంది కానీ ప్రాస నియమము లేదు. ప్రాస అంటే పద్యముయోక్క ప్రతి పాదములోను  రెండవ అక్షరము తానుగా కానీ గుణింతముతో కూడుకొని గానీ రావలయును. ప్రాసనియమము లేకున్నను ఈ సీసమునందు ప్రాస నియమము పాటించి వ్రాయ ప్రయత్నించినాను. ఈ ప్రాస కొంత దుష్కరము కూడా. ఈ మాటలు జిజ్ఞాసువుల కొరకు వ్రాసినాను. పొగరుతో వ్రాసిన మాటలు కావు.

కర్ణామృతంబైన కథల కారకుడీవు

వర్ణాల కందని వస్తువీవు

వర్ణనా తీతమౌ వర భూరుహము నీవు

పర్ణఛాయల నీదు బరగనివ్వు 

జీర్ణమైతిని విధి చీర్ణ సమ్మెట పోట్ల

చూర్ణమైపోనట్లు చూడుమయ్య

కీర్ణుండ  జరచేత శీర్ణుండ బ్రతుకనే

ఆర్ణవం దాటించు పూర్ణ పురుష


బాల్యమన్దున బుద్ది నే బడయనైతి

యౌవ్వనపు క్రొవ్వు తోడ నిన్నరయనైతి

కాలునకు చేరువగునేడ కలిగే బుద్ధి

కాలకాలుడ కావుమా కరుణ తోడ

పరమేశ్వరా!

చెవులకింపైన కథలు కల్గినవాడవు, అక్షరాలకు అందనివాడవు అంటే వర్ణనాతీతుడవు,  పొగడలేనంత మహిమలుకలిగిన కల్పవృక్షము నీవు, నీ నీడలలో నన్ను ఉండనివ్వు. విధి యొక్క ఉలి సమ్మెట పోట్లకు బాగా గురియైన వాణ్ణి. నేను పొడి పొడి కాకుండా చూసుకో. ముసలితనముచేత కప్పబడి చిక్కిన  వాడను . ఈ బ్రతుకనే సముద్రము దాటించు మహానుభావా.

చిన్న వయసు లో బుద్ది వికసించ లేదు. యౌవ్వనములో క్రోవ్వుతో కళ్ళు కనిపించ లేదు. యమునికి చేరువైతినని తెలిసినతరువ్వత నాకు బుద్ది కలిగింది. యమునికి యముడైన మహాప్రభో నన్ను కాపాడు తండ్రీ.



Wednesday 20 November 2013

బిరుదులు ********

బిరుదులు 

బ్రాందీ మత్తున వుంటే గాంధీ కనిపించునా 
నెహ్రూ వంశజులందున నేతాజీ ఉండునా 
వల్లభాయి పటేలునకు వారెక్కడ సరిదీటు 
ఉక్కుమనిషి కడ వుండదు ఉలూకమ్ములకు చోటు 
అన్నాడిఎంకే తో అక్రమ సంబంధం 
తెచ్చెను ఏమ్జీయారుకు తిరుగు లేని రత్నం **********
తెలుగుజాతి తెలుగునీతి తెలుగురీతి యని మనసా 
గర్జించే సింహమెదుట కానము,నక్కల తెలుసా 
పీవి యన పండినట్టి విజ్ఞ్యానిగ తెలుసుకొమ్ము
వీపీ లాయన నెవ్విధి వేలకట్టెద రనుకొందుము (వీ పీ= వెర్రి పుచ్చకాయలు)
అటలుడెంత జటిలుడో అందరికీ తెలిసినదే
రాహువుతో పోల్చకండి రారాజును పదేపదే
ధ్యానచంద్రునకు ధ్యానము ధ్యాసంతా హాకీనే
ఏమి ఇచ్చినాకూడా ఇంకయునూ బాకీనే
హిట్లరు ఆహ్వానమునే కాదని తాననగలుగు 

భరత రత్న బిరుదన్నది ఆమహానీయునికే తగు 
ఆటలోని నైపుణ్యము అందలమెక్కించ బోదు
అసలైనది లౌక్యమండి అది కల్గిన అసలు జోదు
బహు మార్గమ్ముల ధనము భరతరత్న బిరుదము

తమకు తామె చేరువౌను అదికలిగిన, ఇది నిజము
దేశము గర్వించదగ్గ నేతాయెను చూడు మోడి 
ప్రతిపక్షము దేనుగు పై దుమ్ముజల్లునట్టి  దాడి
భారత దేశాంబరమున ప్రభవించిన మణులు వాళ్ళు
వారిముందు దిగదుడుపీ వల్లకాటిలోని రాళ్ళు

Monday 18 November 2013


EGO


There was a pot maker in a small village.


Once, during Durga Pooja, he made plenty of idols,

loaded them onto the back of his donkey, and

walked to the town to sell them. On the way, people

would see the idols and fold their hands. The

donkey was nonplussed, but after a while, began

standing still, proudly, whenever people would fold

their hands. This went on till the pot maker reached

the town. By the evening, the pot maker had sold

all his idols and began his trip back to the village.

Whenever someone would pass them, the donkey

would stand still proudly, expecting people to wish

him, but this did not happen. The donkey kept

stopping and wouldn't understand why no one was

paying obeisance to him. The pot maker was

irritated for he couldn't understand the strange

behavior of his donkey. After trying to cajole and

force him to move, the man began beating up the

donkey.

This story applies to all those who carry

bloated egos. We are only carriers, not the object

that we are carrying. Responsibilities are gifted

to all of us by God, but we can only carry those for

some time. Why then, have ego for luggage?

- Anonymous



May be, if I were to lose my ego and let go

my luggage I would be so much happier ! A little

bit of humility and a dose of self realization that

we are all the same, each one has a different ability

and each one has a different responsibility could

make our lives so much more fulfilling.

So I have decided that I would rather be a

human being than the donkey in the story above.

Better late than never! What about you?

The name given to you by your parents accompanies you till you depart.The adamentine wall that shuts us in is egoism; we refer every thing to ourselves, thinking I do this,that and the other.If we get rid of this puny I and stick to not I but YOU feel it and live it the entire ego will get dismantled and your movement will be advanced towards HIM.
Age,Ability and Abdication of EGO brings you respect.That accompanies you till the end because you din't aspire for it but you deserved it. That is the tradition and custom of this Dharma.
To be on carpet or to be on velvet or to be under a cloud or to be ill at ease you are not the reason, HE is accomplishing you or testing you and nothing in your hands. The only thing you have is to shun 
your EGO and surrender to HIM. He is the right person to give Right Things ar Right Time. To give up the world is to forget the EGO and that will enable you to live in the body and not of it. 


So I have decided that I would rather be a human being 

than the donkey in the story above.

Better late than never! What about you?





















Saturday 16 November 2013

అమందానంద కందళితాస్యము

కలికి కన్నులు జూడ కల్హార సాదృశము
కరవాలమును బోలు కలికి నాసికము
అరుణ భానూదయము ఆమె ఓష్ఠద్వయము
హరిత తాలుపు తాప హరితమాచూపు



  • Ramamurthy Rv Your response to the coment, ehnances the deservedness which sincerely reflects the 
  • true personality Sir,

Tuesday 5 November 2013

మదర్స్ డే --ఫాదర్స్ డే 

దయవుంచి ఓపికతో ఒక్క సారి చదవండి. చదివి మీ అభిప్రాయం తెలుపండి. బాగుంటే పదిమంది తో పంచుకోండి. 

దీపావళి పండగ సందడి ముగిసింది. సెలవరోజు సంబరాలు. తలంటి స్నానాలు. కొత్తబట్టలు. అమ్మవారి పూజలు. దేవాలయ సందర్శనాలు. బంధుమిత్రులకు శుభాభినందనలు. మిఠాయి పంపకాలు. మృష్ఠాన్న భోజనాలు. టపాకాయల చప్పుళ్ళు. అన్నిటినీ అనుభవించి అలసి నిద్రాదేవిని ఆహ్వానిస్తున్నవేళ ఒక చిన్న ఆలోచన చిగురించింది.

 పండగలన్నిటి చారిత్రక, పౌరాణిక కారణాలు ఏమైనప్పటికీ…నా అభిప్రాయములో…మూలాన వున్న కారణము…చెడుపై మంచి సాధించిన విజయాన్ని సంబరంగా జరుపుకోవటమే. అది దీపావళి కానివ్వండి. దసరా కానివ్వండి. కృష్ణాష్టమి కానివ్వండి. ఏ పండగ మూలకారణము అయినా మంచి బుద్ధికే అంతిమ విజయము అని చెప్పటమే....

పై అభిప్రాయమును యథా తధముగా గ్రహించి మిగత విషయాలపై నా అభిప్రాయాన్ని ఈ క్రింద విశధ

పరచుచున్నాను. మనము పండగ ఎందుకు చేసుకొనేది వివరించినారు . అది వాస్తవమే. కానీ
పాశ్చాత్యులు చేసేవి తద్దినాలు. తప్పుగా అనుకోవద్దు. తత్+దినము అంటే ఆ రోజు అని అర్థము .అది అమ్మ రోజు కావచ్చు నాన్న రోజు కావచ్చు మరేరోజైనా కావచ్చు. కానీ మన సాంప్రదాయమదికాదు. కాలే వత్తిని కాస్త ఎగ దోస్తాము ఎందుకంటే అది ఇంకా బాగా మండాలని. అంటే మన అన్ని పండగల సారాంశముఒకటేకాబట్టిమనలోవుండేమంచినిమళ్ళీమళ్ళీఉత్తేజితముచేస్తాము.వారిసంస్కృతికిమనసంస్కృతికి హస్తిమశకాంతరము. వాళ్ళ పద్ధతికి మన పద్ధతికి పండుగకు తద్దినానినికి ఉన్నంత తేడా వుంది.

దాదాపు 13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ జాతికి పెళ్లి అన్నది ,నేటికి కూడా,ఆడామగా

సంబంధము. అదే మనకు రెండు కుటుంబాల అనుబంధం. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే రేపు వీనికి విడాకులిచ్చి వేరొకనితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్నా దంపతులు అదృష్ట వశాన రెండు మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే వ్రాసుకొంటారు లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రమమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే వాడు ఆమె పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. ఇట్లా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ అమ్మ వాళ్ళను కలిస్తే వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది. ఇది MOTHERS' DAY. ఆలాగే Fathers' Day కూడా. మిగతవన్నీ మతాకర్షణ మారణాయుధాలు.

PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.

ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మా లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె' గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత కౄరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూదా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటుకుపంపుచున్నాము) దిగవిడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. నాకు తెలిసినంతవరకు నేటికి కూడా స్త్రీ అమెరికా ప్రసిడెంటు అగుటకు అనర్హురాలే.

అటువంటిసమయములో ఫ్రాన్సుకుచెందిన 'Simone de Beauvoir' 1949 లో 'The Second Sex'
(a detailed analysis of women's oppression and a foundational tract of contemporary feminism ) అన్న విశ్లేషణ గ్రంథముఫ్రాన్స్ లో మహిళా చైతన్యమును తీసుకురాగాలిగినది. తన 14 వ ఏటి వరకుతీవ్ర మతఛాందసత కల్గిన'కాథలి' క్కయిన ఆవిడ మతమును వదలి మానవతను అవలంబించి'jean-Paul-Sartre' తో అవివాహితగా కాలం గడిపినా స్త్రీ స్వాతంత్ర్యము కొరకు మిక్కుటముగా శ్రమించినది. ఆతనుకూడా ఆమెకు చేదోడు వాదోడు గా ఉండినాడు.ఆ ఉద్యమము ఐరోపా ఖండములో చెప్పుకోదగిన చైతన్యమును తెచ్చింది.

ఇక్కడ ఒక్క మాట చెబుతాను. పాశ్చాత్య నాగరికత తెరచిన అరచేయి లాంటిది.వాళ్ళకు చెప్పగలిగినవిచెప్పకూడనివి, చేయ గలిగినవి చేయ కూడనివి అన్న తారతమ్యము వుండదు.అది వాళ్ళ నాగరీకత. ఈ సందర్భములో VVS శర్మ గారు చెప్పిన మాట గుర్తుచేయుచున్నాను:'మనది సంస్కృతి వారిది నాగరికత.' ఇది బహు చక్కని మాట. ఇక కమునిష్టు దేశాలది ముడిచిన అరచేయి.వారిది 'గవి లోమాయ'అంటే లోపలఏముందో ఏమిజరుగుతూందో ఎవరికీ తెలియదు. మన సంస్కృతి 'గోకర్ణము' లాంటిది. అనగా ఆవు చెవి లాంటిది. మనము తీర్థము తీసుకోనేట్లుంటే చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నడుమన బొటన వ్రేలును దూర్చి తీర్థము తీసుకొనవలెను. అది ఆవు చెవి ఆకారాన్ని కలిగియుంటుంది. అంటే సగము మూసి సగము తెరిచి వుంటుంది చేయి. కావున చెప్పగలిగినవి చెప్పలేనివి అన్న విచక్షణ కలిగి యుంటాము. 'మధ్యేమార్గము మంచి మార్గము''అతి సర్వత్ర వర్జ్యేత్' అన్న నానుడులు మనము ఆచరణలో పెట్టే వారము. మనసు మాటలో మాట చేత లో
ప్రతిఫలిచవలెనన్న 'త్రికరణ శుధ్ధి' ఇచట ప్రతిబింబించు చున్నది కదా! మరి మన సంస్కృతిని విస్మరించనగునా!

మంచిని ఎక్కడవున్న గ్రహించ వలసిందే. కానీ దానికి విచక్షణ అవసరముకదా.ఇక్కడ ఇంకొక చిన్న విషయాని వివరించ దలచుకొన్నాను. ఎవరో సహనము పాటించుట తప్పు కాదు కదా
అన్న అబిప్రాయమును వ్యక్తము చేసినారు.మన దేశపు ఇప్పటి పరిస్థితిని ఒక మధుమేహ రోగితో(మోసాలు ద్రోహాలు,మానభంగాలు,కుళ్ళు,కుట్రమొదలగు విషయముల కలగా పులగమే ఈ మధు మేహము) పోల్చవచ్చు. మొదలే తాను తనను వదలని వ్యాదితో బాధపడుతూ వుంటే కాలికి దెబ్బ తగిలితే ఏమి చేయాలి. సహనము మాత్రం పాటించే వీలు లేదు. పాటించితే కాలే తీసివేయ వలసి రావచ్చు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః --యత్రైతాస్తు అపూజ్యన్తే తత్రైతాస్తఫలాక్రియాః' అనిచెప్పిన దేశమునకు, తమ తమ దేశములలోని 'Red Light Area' లలో 'జాగ్రత్త మీరు మీ బిడ్డ వద్దకు వెళ్ళుట లేదు కదా'( ఆ విధంగా ఆ దేశాలలోని ఆ ప్రాంతాలలో వ్రాసి యున్చుతారని విన్నాను) అని వ్రాసుకొనే దేశాలతో
పోలిక ఎక్కడ?

Srinivas Yanamandra సర్. మీరు చాలా ఓపికతొ పలు విషయాలు విశదీకరిస్తూ రాసిన వ్యాసము నిజంగా చాలా బాగుంది. దీనికి ప్రేరణ నా దీపావళి 

చిన్న పోస్టు అని ఆనందముగా కూడ ఉన్నది. మీరు చెప్పిన చాలా విషయాలు నాకు తెలియనవి. మీ అనుభవరత్యా మీరు గ్రహించినవి. అందుకని అవి 

తెలుసుకున్నందుకు చాలా సంతోషముగా కూడ వున్నది.

భావరాజు పద్మిని చాలా చక్కగా వివరించారు బాబాయ్. మీ వంటి పెద్దలే 'చెడు మీద మంచి గెలుపు' పండుగ అంటూ చక్కగా చెప్పగలరు... ధన్యవాదాలు.

Bhanu Gouda రామ మోహన్ రావు గారు 


మీరు చాల విషయాలు చక్కగా చెప్పారు.

Pallam Raju Malyala చాలా విషయాలు తెలిశాయి. ఈ సాహితీ చర్చలో పాల్గొన్న వారికి , విషయాలు తెలిపిన గురువులకు ధన్యవాదాలు.

Subhash Chandra Bose M చాల బాగా సెలవిచ్చారు. 

Kannaji Rao Jr. నిజం శర్మ గారు చెప్పినట్టు"మనది సంస్కృతి వారిది నాగరికత" బహు బాగ సెలవిచ్చారు

Ranga Prasadarao చక్కటి విశ్లేషణ .....వివరణ,,,,మంచి ఎక్కడయినా మంచే కదా......మంచిని గ్రహించడానికి విచక్షణ అవసరమా ??!!!